మున్సిపల్ ఎన్నికల్లో వింత పోకడలు.. పెళ్లిళ్లకు, పిల్లలు పుడితే ఆర్థిక సాయం.. బాండ్ పేపర్పై హామీలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు, పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. డబ్బులు, మద్యం మాత్రమే కాకుండా ఖరీదైన బహుమతులు అందిస్తూ.. తమకే ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. రోజురోజుకూ అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లుతో.. ఓటర్లే ఆశ్చర్యపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కౌన్సిలర్గా గెలిచి.. ఛైర్పర్సన్ సీటు దక్కించుకునేందుకు అభ్యర్థులు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
Municipal Elections
మున్సిపల్ ఎన్నికల్లో వింత పోకడలు.. పెళ్లిళ్లకు, పిల్లలు పుడితే ఆర్థిక సాయం.. బాండ్ పేపర్పై హామీలు
వేసవి కాలం రాకముందు నుంచే గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతోంది. హోరాహోరీగా సాగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెరపడనుంది. పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు.. ఈ ఎన్నికల ప్రచారం కోసం రాత్రి, పగలు తేడా లేకుండా తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 11వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. చివరిసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు, పార్టీలు ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రకరకాల హామీలు ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల కోసం కొత్త కొత్త హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లనే ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
సాధారణంగా ఎన్నికలు ఉన్నాయంటే చాలు.. మద్యం, డబ్బు, బిర్యానీ, చికెన్, మటన్.. ఇంటింటికీ తిరిగి పంచేవారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అది కాస్తా హద్దు దాటింది. ఇళ్లళ్లోకి కావాల్సిన ఖరీదైన వస్తువులను ఇచ్చేస్తున్నారు. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, ప్రెజర్ కుక్కర్లు, డిన్నర్ సెట్లు, కూలర్లు.. ఇలా ఒక్కటేంటీ రకరకాల వస్తువులను పంచుతున్నారు.
వీటితోపాటు తమ వార్డు పరిధిలో ఉన్న వారి ఇళ్లల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు జరిగితే వారికి ఆర్థిక సాయం అందిస్తామని హామీలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా పుట్టే ఆడబిడ్డల పేరు మీద కూడా డబ్బులు ఇస్తామని పేర్కొంటున్నారు. ఇంకా కొందరు బాండ్ పేపర్ల మీద హామీలు రాసిస్తుండగా.. మరికొందరు ఓటర్ల నుంచి ప్రమాణాలు తీసుకుంటున్నారు.
కల్లూరులో బాండ్ పేపర్పై ప్రమాణ పత్రం
ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న వేము విజయలక్ష్మి.. రూ.100 బాండ్ పేపర్పై తాను అమలు చేయనున్న వాగ్దానాలు రాసి ఇచ్చారు. తన సొంత డబ్బులతో తన వార్డు ప్రజలకు చేసే పనులకు సంబంధించిన వివరాలను బాండ్ పేపర్పై రాసి ప్రచారం చేశారు.
తన వార్డు పరిధిలో ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే.. ఒక్కొక్కరికీ 20 సిమెంట్ బస్తాలను ఫ్రీగా ఇస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా తన వార్డులో నివసించే నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి రూ.5,116 సాయం చేస్తానని చెప్పారు. నిరుపేదలకు పుట్టే ప్రతీ ఆడబిడ్డకు ఒక్కొక్కరికీ రూ.5116 చొప్పున అందిస్తానని వెల్లడించారు.
ములుగులో ఆడబిడ్డ పెళ్లికి రూ.10వేల సాయం
ములుగు జిల్లాలోని ములుగు మున్సిపాలిటీ 1వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున నేషనల్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్ అంగోతు శిరీష బరిలో నిలిచారు. డిగ్రీ వరకు చదివిన అంగోతు శిరీష.. 2014లో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన 60వ నేషనల్ స్కూల్ గేమ్స్లో పాల్గొని జిమ్నాస్టిక్స్లో సత్తా చాటారు.
పటియాల, కురుక్షేత్రలో జరిగిన నేషనల్ లెవల్ జమ్నాస్టిక్స్ పోటీల్లోనూ రాణించి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ములుగులో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ పురపాలక సంఘం ఎన్నికల్లో తనను గెలిపిస్తే తాను పోటీ చేసే వార్డులో పెళ్లి చేసుకునే ప్రతి యువతికి రూ.10 వేల చొప్పున అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక ఆడపిల్ల పుడితే వారి పేరు మీద రూ.5 వేలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వాగ్దానం చేశారు.
ఆందోలు-జోగిపేటలో తాళిబొట్టు, మెట్టెలు
సంగారెడ్డి జిల్లా ఆందోలు-జోగిపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీచేస్తున్న చౌదిగారి విజయలక్ష్మి తన భర్త నర్సింహులు, కుమారుడు సాయికుమార్తో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను 10వ వార్డు కౌన్సిలర్గా గెలిపిస్తే.. యువతుల పెళ్లిళ్లకు పుస్తె, మెట్టెలు కానుకగా ఇస్తానని పేర్కొన్నారు.
తన వార్డులోని ప్రజలు ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియల ఖర్చుల కింద రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. పుట్టిన ప్రతి బిడ్డకు సీఎస్కే కిట్ ఇస్తామని వెల్లడించారు. వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు స్పెషల్ అకౌంట్లో రూ.10 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పారు. ఈ నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.