మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ..పండగకి ఊరెళ్లిన సమయంలో
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో భారీ చోరీ జరిగింది. లక్షన్నర నగదు, ఆభరణాలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) ఇంట్లో భారీ దొంగతనం జరిగినట్లు సమాచారం అందింది. ఈ దొంగతనం విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో లక్షన్నర నగదుతో పాటు దొంగలు భారీగా ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ చోరీపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సమయంలో పొన్నాల లక్ష్మయ్య ఫ్యామిలీ ఇంట్లో లేదని సమాచారం. ఆయన పండుగకు జనగాంకు కుటుంబంతో సహా కలిసి వెళ్లారని తెలుసుకుని.. అదే అదనుగా భావించి దొంగలు దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పొన్నాల లక్ష్మయ్య చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోనే ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే, మంత్రిగానూ పదవులు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడిన పొన్నాల.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) లో చేరారు. కానీ ఆయన ఎక్కడి నుంచీ పోటీ చేయలేదు.