తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి వస్త్రాలు ఈ – వేలం.. మీరూ సొంతం చేసుకోవచ్చు..
తిరుమల భక్తులకు శుభవార్త.. శ్రీవారి వస్త్రాలు ఈ – వేలం.. మీరూ సొంతం చేసుకోవచ్చు..
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలతో పాటుగా టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకలుగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తోంది. మార్చి రెండో తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకూ ఈ వేలం ప్రక్రియ జరగనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. మరోవైపు టీటీడీలో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపు కోసం కూడా టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు టీటీడీ ఏఈవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Tirumala
శ్రీవారి వస్త్రాలు ఈ – వేలం
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. శ్రీవారి వస్త్రాలను సొంతం చేసుకునే మంచి అవకాశం మీ ముందు ఉంది. మార్చి రెండో తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి వస్త్రాలను ఆన్లైన్ ద్వారా ఈ – వేలంలో ఉంచుతారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు.. టీటీడీ అనుబంధ ఆలయాలకు వచ్చిన భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టీటీడీ ఈవేలంలో ఉంచుతోంది. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న 287 లాట్ల ఆర్ట్ సిల్క్ చీరలు, హాఫ్ సారీస్, సిల్క్ చీరలు, ఆర్డినరీ చీరలు ఈ వేలంలో ఉంచనున్నారు.
మార్చి రెండో తేదీ నుంచి వారం రోజుల పాటు టీటీడీ ఆన్ లైన్లో EA ID Nos 25597 నుంచి 25602, అలాగే EA ID Nos 25604 నుంచి 25609 ద్వారా ఈ – వేలం వేయనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ – కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, ఆసక్తి కలిగినవారు శ్రీవారి వస్త్రాల ఆన్ లైన్ వేలంలో పాల్గొనవచ్చని టీటీడీ సూచించింది. ఇతర వివరాలకు టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా 0877-2264429 / 9959988470 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
స్క్రాప్ తొలగింపుపై టీటీడీ కీలక నిర్ణయం..
మరోవైపు టీటీడీలో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపుపై టీటీడీ దృష్టి పెట్టింది. వివిధ విభాగాల్లో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన స్క్రాప్ తొలగింపు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని టీటీడీ ఏఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం రోజున వివిధ విభాగాల అధికారులతో టీటీడీ ఏఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలోని అన్ని విభాగాల్లో ఉన్న స్క్రాప్ గుర్తించి 15 రోజుల్లోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఆరు నెలలకూ స్క్రాప్ తొలగింపు కోసం షెడ్యూల్ రూపొందించాలన్నారు. వేలం ద్వారా స్క్రాప్ను ఎప్పటికప్పుడు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మరోవైపు టీటీడీ చేపడుతున్న అభిప్రాయ సేకరణ మంచి ఫలితాలు ఇస్తోంది. వివిధ అంశాలు, టీటీడీ సేవలపై తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటోంది. భక్తుల ఫీడ్ బ్యాక్ కారణంగా తిరుమలలో ప్రజా రవాణా, అన్న ప్రసాదం, పారిశుద్ధ్య సేవలు మరింత మెరుగయ్యాయని వెంకయ్య చౌదరి తెలిపారు. ఇదే స్ఫూర్తితోనే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ ఏఈవో ఆదేశించారు.