ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు
Andhra Pradesh Government Introduced Three Tier Secretariat System:
ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చేసింది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలుగా పేర్ మార్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ శాఖలో మూడంచెల అధికారుల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైలైట్:
ఏపీలో స్వర్ణ కార్యాలయాలపై పర్యవేక్షణ
అమల్లోకి వచ్చిన మూడంచెల వ్యవస్థ
విధులు, బాధ్యతలపై మార్గదర్శకాలు
AP Swarna Gramam And Swarna Ward
స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. ఈ మేరకు కొత్తగా తీసుకొచ్చిన మూడంచెల వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు విధులు, బాధ్యతలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలపై పర్యవేక్షణ కోసం జిల్లా, మండల, పట్టణ స్థాయిలో అధికారుల్ని నియమించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారు. అయితే ఈ కార్యాలయాలపై పర్యవేక్షణ లేదనే అభిప్రాయాలు రావడంతో కూటమి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలుగా మార్చేశారు. అలాగే ఆ ఆఫీసులపై పర్యవేక్షణ కోసం మూడంచెల వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. ఈ మేరకు ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యుటేషన్లపై 2,778 మంది అధికారులను నియమించింది. జిల్లాస్థాయిలో అధికారులు ఆయా జిల్లాల్లోని స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలపై పర్యవేక్ష ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా సంక్షేమ పథకాల అమలు బాధ్యత తీసుకుంటారు. ప్రజలకు సేవలు అందించేందుకు కాల వ్యవధి అమలు చేసేలా చూస్తారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలను తనిఖీలు చేయాల్సి ఉంటుంది.. ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే కనుక సరిదిద్దుతారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు ఇంటర్నెట్ కోసం ఒక్కో కార్యాలయానికి నెలకు రూ.1,000 చొప్పున కేటాయిస్తున్నారు.
జిల్లా స్థాయిలో అధికారులు.. ముందస్తు అనుమతి లేకుండా స్వర్ణ గ్రామ, వార్డు శాఖ ఉద్యోగులు ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్లపై వెళ్లకుండా చూస్తారు. అలాగే ఉద్యోగుల బయోమెట్రిక్ను హెఆర్ఎంఎస్ పోర్టల్లో చేస్తారు. ప్రజలకు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో కొన్ని సేవలు అందిస్తారు.. ఈ సేవలకు సంబంధించి ప్రజల నుంచి కొంత ఫీజులు వసూలు చేస్తారు. ఆ డబ్బుల్ని అదే రోజు కచ్చితంగా బ్యాంకు అకౌంట్లో జమ చేయించాలి. ఒకవేళ ఆ రోజు కుదరని పక్షంలో మరుసటి రోజైనా బ్యాంకులో జమ చేయించాల్సి ఉంటుంది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ఉద్యోగులపై ఏవైనా ఫిర్యాదులు వచ్చినా, అక్రమాలు చేసినా విచారణ చేయాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో వారిపై క్రమశిక్షణా చర్యల కోసం జిల్లా కలెక్టర్తో పాటుగా రాష్ట్ర స్వర్ణ గ్రామ, వార్డు శాఖకు నివేదికలు పంపించాల్సి ఉంటుంది.. ఆ తర్వాత వారి నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయాల్సి ఉంటుంది.
మండల, పట్టణ స్థాయి పర్యవేక్షణ అధికారుల విసయానికి వస్తే.. ఉద్యోగులకు సంబంధిత కార్యాలయాల్లో మౌలిక వసతుల పరంగా ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉంటుంది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ఐటీ సేవలకు సంబంధించిన సౌకర్యాలు ఉండేలా చూస్తారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్ వంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధార్ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ.. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక ఆధార్ సెంటర్ తనిఖీ చేయాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసేలా చూస్తారు. ప్రభుత్వం చేపట్ట అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో మూడంచెల వ్యస్థను అమల్లోకి తీసుకొచ్చింది.