ఉసూరుమనిపించిన ‘గుంటూరు కారం’ టీం.. నిరాశలో మహేష్ బాబు ఫ్యాన్స్
Guntur Kaaram Pre Release Event మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు అనుమతిని ప్రభుత్వం ఇచ్చేందుకు నిరాకరించింది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదట.
ప్రధానాంశాలు:
- గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్
- ప్రభుత్వం నుంచి రాని అనుమతి
- ఈవెంట్ రద్దుతో నిరాశలో మహేష్ ఫ్యాన్స్
అసలే ఇప్పుడంతా కూడా సంక్రాంతి సినిమాల మీద చర్చలు జరుగుతున్నాయి. ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు వస్తున్నాయి.. ఏ చిత్రానికి జనాలు అధికంగా మొగ్గు చూపుతున్నారు.. ఈగల్ పక్కకి తప్పుకోవడంతో ఆ థియేటర్లన్నీ ఎవరికి ఇస్తారు.. హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం పోటీ ఎలా ఉండబోతోంది? అంటూ ఇలా పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఆదివారం నాడు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఆదివారం జరిగే ఆ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వెళ్తున్నాడు. శనివారం నాడు జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక దీంతో అభిమానులు మాత్రం కాస్త నిరాశ చెందుతున్నారు.
శనివారం వాయిదా పడటంతో.. ఈవెంట్ను ఆదివారం పెడతారా? హనుమాన్ ఈవెంట్కు పోటీగా దించుతారా? అనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా గుంటూరు కారం, హనుమాన్ మధ్య అయితే కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఉన్న థియేటర్లన్నీ గుంటూరు కారం చిత్రానికే ఇస్తున్నారంటూ హనుమాన్ నిర్మాత వాపోతోన్న సంగతి తెలిసిందే. జనవరి 12న బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు విపరీతమైన బజ్ ఏర్పడింది. అయితే హనుమాన్ చిత్రానికి నార్త్లోనూ ఫుల్ క్రేజ్ ఏర్పడింది. అక్కడా పెద్ద రేంజ్లో బిజినెస్ జరిగిందన్న సంగతి తెలిసిందే.