ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూసివేత

తిరుమల : తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini ) నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు (TTD Officers) వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని తెలిపారు. ఈ నెల రోజుల పాటు పుష్కరిణికి హారతి ఉండదని వివరించారు.
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తామని తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తామన్నారు.
మరమ్మతులు పూర్తి చేసి చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తామని వివరించారు. పుష్కరిణిలోని నీటి పీహెచ్ విలువ 7 ఉండేలా టీటీడీ వాటర్ వర్క్స్ (Water works ) విభాగం చర్యలు తీసుకుంటుందన్నారు.