Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి కోటా స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ మంగళవారం విడుదల చేసింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ లో లాగిల్ అయ్యి టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జనవరి నెల కోటా టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ తెలిపింది.
Tirumala Darshan Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 కోటా) టికెట్లను విడుదల చేసింది. జనవరి 1వ తేదీ మినహా మిగతా తేదీల టికెట్లను అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 23వ తేదీ నుంచి 30వ తేదీ కోటా టోకెన్లను కూడా టీటీడీ విడుదల చేయలేదు. భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్ సైడ్ ద్వారా జనవరి కోటా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు శ్రీవారిని సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ప్రతి నెల టీటీడీ విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన స్పెషల్ దర్శనం టికెట్లు మంగళవారం ఉదయం పది గంటలకు విడుదల చేసింది. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించి శ్రీవాణి భక్తుల దర్శనం టికెట్లతో పాటు వసతి కోటా టికెట్లను టీటీడీ సోమవారం(అక్టోబర్ 23) విడుదల చేసింది.
భక్తుల విరాళాలు
తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీగా విరాళం అందజేశారు. ఎస్.వి అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన వికాస్ కుమార్ కిషోర్ బాయ్ ఇటీవల అశ్వవాహన సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని కలిసి డీడీని అందజేశారు. అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 9.5 టన్నుల బరువు గల రూ.2 లక్షలు విలువైన కూరగాయలను విరాళంగా అందించారు.
ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు
నేటి నుంచి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29 వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 26న స్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం, 27న రథోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. తిరిగి 29వ తేదీ ఉదయం ఆలయం తెరిచి శుద్ధి చేస్తారు. అదే రోజు రాత్రి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవతో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాల ముగియనున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా స్వామి వారికి జరిగే నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ద్వారకా తిరుమల ఆలయ అధికారులు తెలిపారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామికి బంగారు సింహాసనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు ఇటీవల అందజేశారు. బొత్స గురునాయుడు, ఈశ్వరమ్మ దంపతులు, దివ్యశ్రీ మజ్జి రామారావు కళావతమ్మ దంపతుల జ్ఞాపకార్ధం ద్వారకా తిరుమల స్వామి వారికి బంగారు సింహాసనాన్ని అందజేసినట్లు తెలిపారు.