Hyderabad: నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు

హైదరాబాద్ నగరవాసులకు రైల్వే మంత్రి తీపికబురు చెప్పారు. ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్)విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ప్రకటించారు.
02 కిలోమీటర్ల పొడవున నిర్మాణం
పార్లమెంట్లో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడి
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరవాసులకు రైల్వే మంత్రి తీపికబురు చెప్పారు. ఎంఎంటీఎస్ (మల్టీమోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్)విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని ప్రకటించారు. ఎంఎంటీఎస్ ప్రాజెక్టును విస్తరించాలని ఎంతో కాలంగా ప్రయాణికులు, ప్రజాప్రతినిధులు డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో 102.4 కి.మీ. పొడవునా 6 మార్గాల్లో కొత్త రైల్వేలైన్లు, ఫలక్నుమా-ఉమ్దానగర్ వంటి కీలక ప్రాంతాల్లో డబ్లింగ్ నిర్మాణాలను చేపడుతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల పార్లమెంట్లో చెప్పారు. రూ. 1,169 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఈ విస్తరణ పనులను దక్షిణ మధ్య రైల్వే త్వరలో చేపట్టనుంది. ఘట్కేసర్-మౌలాలి సి-కాబిన్ వరకు 12 కి.మీ., ఫలక్నుమా-ఉమ్దానగర్ డబ్లింగ్ లైన్ 1.4 కి.మీ., సనత్నగర్-మౌలాలి బైపాస్ డబ్లింగ్ లైన్ 22 కి.మీ., తెల్లాపూర్-రామచంద్రాపురం కొత్త లైన్ 5 కి.మీ., మేడ్చల్-బొల్లారం డబ్లింగ్ లైన్ 14 కి.మీ., సికింద్రాబాద్-బొల్లారం మధ్య 15 కిలోమీటర్ల రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు చేయనున్నారు. మరోవైపు ఎంఎంటీఎస్ ప్రాజెక్టు విస్తరణలో భాగంగానే ఘట్కేసర్-యాదాద్రి మధ్య 33 కిలోమీటర్ల 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.