విద్యార్థులకు షాక్.. చీటింగ్ చేస్తే ఎన్నేళ్లు జైలు శిక్షంటే?
పబ్లిక్ పరీక్షల సమయంలో కొందరు విద్యార్థులు చీటింగ్ చేస్తుంటారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని ఒడిశా ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకురానుంది. పబ్లిక్ పరీక్షల్లో ఎవరైనా విద్యార్థులు చీటింగ్ చేస్తూ దొరికినట్లయితే లేదా ఏవైనా అవకతవకలకు పాల్పడినట్లయితే మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు రూ.10 లక్ష వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
దీనికి సంబంధించిన బిల్లుకి ఒడిశా ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది. రాబోయే శీతాకాల సమావేశాల్లో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఎవరైనా పరీక్షల పేరుతో మోసం చేస్తే ఐపీసీ కింద ఏడేళ్ల వరకు, బీఎన్ఎస్ కింద మూడేళ్ల వరకు వారికి శిక్ష పడుతుంది. అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కేవలం పబ్లిక్ పరీక్షలు అనే కాకుండా వివిధ పరీక్షల కోసం కొందరు మధ్య వర్తిలతో డీల్ కుదుర్చుకుంటారు. ఇలాంటి వారికి దాదాపుగా రూ. కోటి వరకు జరిమానా విధిస్తారు. అలాగే పరీక్ష ఖర్చు వంటివి కూడా వారి నుంచే వసూలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా ఇంత జరిమానా చెల్లించకలేకపోతే వారికి భారతీయ న్యాయ సంహిత, 2023లోని నిబంధనల ప్రకారం అదనంగా జైలు శిక్ష విధిస్తారు.
గతంలో ఒడిశాలో ఓ చట్టం అమలులో ఉండేది. 1988 సమయంలో ఒరిస్సా కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఎవరైనా పరీక్షల్లో చీటింగ్ చేస్తే మూడు నెలల శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించేవారు.