విజయవాడ: ఇంటి ముందు అనుమానాస్పద వ్యక్తులు.. వచ్చి డోర్ కొడితే ఊహించని ప్రశ్న వేసిన బాలుడు..
ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడిని కొంతమంది ఆగంతకులు బెదిరించిన ఘటన.. విజయవాడలోని పటమట ప్రాంతంలో చోటుచేసుకుంది. యారంవారి వీధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బాలుడు ఒక్కడే ఉన్న సమయంలో నలుగురు దుండుగులు ఇంట్లోకి ప్రవేశించారు. బాలుడి మెడపై కత్తిని ఉంచి అతని తండ్రి ఫోన్ నంబర్ చెప్పాలని ప్రశ్నించారు. అయితే ఈలోపే చుట్టుపక్కలవారు గమనించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vijayawada news
బాలుడి మెడపై కత్తిపెట్టి బెదిరింపులు
గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందుకు వస్తే.. పసి పిల్లలు, చిన్నారులు ఏం చేస్తారు.. భయంతో పెద్దవాళ్ల దగ్గరకు పరుగులు తీస్తారు. కానీ విజయవాడలోని పటమట ప్రాంతంలో ఓ 13 ఏళ్ల బాలుడు ఏం చేశాడో తెలిస్తే.. అతని ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేరు. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం రోజు ఈ ఘటన జరిగింది. రాజేష్ అనే వ్యక్తి యారంవారి వీధిలో నివశిస్తున్నారు. ర్యాపిడో నడిపే రాజేష్కు భార్యా, ఇద్దరు కొడుకులు ఉన్నారు. శనివారం సెలవు రోజు కావటంతో చిన్న కొడుకు 13 ఏళ్ల హర్ష ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నాడు. అయితే తండ్రి పనికి వెళ్లటం, తల్లి బయటకు వెళ్లటంతో హర్ష ఇంట్లో ఒక్కడే ఉన్నాడు.
ఈ సమయంలోనే ఇద్దరు ఆగంతకులు రాజేష్ ఇంటి వద్ద తచ్చాడుతూ కనిపించారు. ఇంటి ముందు కొత్త వ్యక్తులు కనిపించడంతో హర్షలో భయం మొదలైంది. దీంతో ఇంటి తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఓ పది నిమిషాల తర్వాత ఆ ఇద్దరికి మరో ఇద్దరు తోడయ్యారు. నలుగురు కలిసి రాజేష్ ఇంటి వద్దకు వచ్చి డోర్ కొట్టారు. తలుపులు తీయమని హర్షను అడిగారు. దీంతో భయపడిపోయిన హర్ష.. డోర్ తీయలేదు. మీరెవరంటూ వారిని ప్రశ్నించాడు. దీంతో వచ్చిన నలుగురు మీ నాన్న మాకు తెలుసని.. నీకు కవర్ ఇవ్వామన్నారని చెప్పారు. అయితే వారి తీరుపై అనుమానం పెంచుకున్న హర్ష.. మా నాన్న ఈ రోజు ఏ రంగు చొక్కా వేసుకున్నాడంటూ ఎదురు ప్రశ్నించాడు. దీంతో వచ్చిన నలుగురు కంగుతిన్నారు.
బాలుడి ముందు తమ ఆటలు సాగవని గుర్తించి.. ఇక బలవంతంగా తలుపులు పగలగొట్టారు. లోపలికి ప్రవేశించి.. ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. బాలుడి మెడపై కత్తిపెట్టి.. మీ నాన్న ఫోన్ నంబర్ చెప్పాలంటూ బెదిరించారు. దీంతో బాలుడు గట్టిగా కేకలు వేశాడు. హర్ష కేకలు విన్న అతని స్నేహితుడు సాయి.. అక్కడకు చేరుకున్నాడు.
దీంతో భయపడిపోయిన ఆగంతకులు.. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. మరోవైపు ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని విచారించారు. అయితే దీని వెనుక తెలిసిన వ్యక్తులే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ కోణంపైనా ఆరా తీస్తు్న్నారు. సీసీ ఫుటేజీ, వేలిముద్రల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.