మున్సిపల్ పోరు.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు.. హస్తం హవానా..? కారు జోరా..?
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు , 116 పురపాలికల్లో కాసేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 123 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టనుండగా..మొదట పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. వెబ్కాస్టింగ్, 144 సెక్షన్ మధ్య పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం కల్లా పురపాలికలు, సాయంత్రానికి కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి.
హైలైట్:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
కాసేపట్లో ఓట్ల లెక్కింపు
కొనసాగుతున్న ఉత్కంఠ
Municipal Election Results live
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలికల్లోని 2,569 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 123 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి అధికారులు లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మధ్యాహ్నం కల్లా మున్సిపాలిటీల ఫలితాలపై స్పష్టత రాగా.. సాయంత్రం లోపు కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ హాల్ వద్ద, స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారులు నేరుగా ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కేంద్రంలోకి కేవలం గుర్తింపు కార్డులు ఉన్న కౌంటింగ్ సూపర్వైజర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. సెల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరించారు.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. అనంతరం సాధారణ బ్యాలెట్ బాక్సులను టేబుళ్ల వద్దకు చేరుస్తారు. ఓట్లను విడదీసే క్రమంలో పారదర్శకత కోసం అధికారులు ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తున్నారు. మొదట బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. వార్డులోని అన్ని పోలింగ్ స్టేషన్ల బ్యాలెట్లను ఒకే డ్రమ్ములో వేసి కలిపేస్తారు. ప్రతి రౌండ్లోనూ డ్రమ్ నుంచి 1,000 బ్యాలెట్లను తీసి టేబుళ్లకు పంపిస్తారు. అభ్యర్థుల వారీగా ఓట్లను వేరు చేసేందుకు ప్రత్యేక కంపార్ట్మెంట్లున్న చెక్క ట్రేలను ఉపయోగిస్తారు. ప్రతి బ్యాలెట్ పేపర్ను ఏజెంట్లకు చూపిస్తూ.. నోటా చెల్లని ఓట్లను వేరు చేస్తారు. ప్రతి అభ్యర్థికి 100 ఓట్లు రాగానే ఒక కట్టగా కట్టి, మిగిలిన ఓట్ల వివరాలను స్లిప్పులపై నమోదు చేస్తారు. ప్రతి రౌండ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో ఫలితాలను షీట్లలో నమోదు చేసి, సంతకాలు తీసుకున్న తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు. విజేతలకు వెంటనే ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు.
మున్సిపాలిటీల్లో ఒకటి, రెండు రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. వార్డు, డివిజన్కు వేర్వేరుకో ఒక్కో టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్లో వేయి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. మున్సిపాలిటీల్లోని చాలా వార్డుల్లో ఉదయం 11 గంటల లోపే ఫలితాలు రానున్నాయి. అలంపూర్లో 7,104 ఓట్లు పోలవ్వగా.. దాని ఫలితం మొదటగా మొదటి రౌండ్లోనే వచ్చే ఛాన్సుంది. అక్కడ పది వార్డులు ఉండగా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఫలితాల్లో మాదిరిగానే అధికార కాంగ్రెస్ హవా కొనసాగుతుందా..? కారు జోరు చూపిస్తుందా..? కమల వికాసం ఉంటుందా..? అనేది మరికొద్ది గంటల్లే తేలనుంది.
ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ హహ..
ఫిబ్రవరి 11న పోలింగ్ జరగ్గా.. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పీపుల్స్ పల్స్ సంస్థ అభిప్రాయపడింది. 123 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 68-76 స్థానాలను కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ 29-36, బీజేపీ 3-5 స్థానాల్లో గెలవనుందని అంచనా వేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 36 శాతం ఓట్లు, బీఆర్ఎస్ 29.7 శాతం, బీజేపీ 19.3 శాతం ఓట్లను సాధించే ఛాన్స్ ఉందని చెప్పింది. వార్డుల వారీగా చూసినట్లయితే.. మొత్తం 2,569 వార్డులలో కాంగ్రెస్ 1210-1290 స్థానాల్లో విజయం సాధిస్తుందని..బీఆర్ఎస్ 860-930 స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉందని చెప్పింది.