మహాశివరాత్రి: కలలో కనిపించిన శివయ్య.. రూ. లక్షా 30 వేల నాణేలతో శివలింగం..
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుపాడులో చిలకా సాయితేజ అనే ఓ భక్తుడు శివుడి మీద తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. నాణేలతో శివలింగాన్ని తయారుచేశారు. రూ. లక్షా 30 వేల నాణేలను ఉపయోగించి సుమారుగా రెండు నెలల పాటు శ్రమించి ధన శివలింగం తయారు చేశారు. ఈ శివలింగాన్ని మహాశివరాత్రి సందర్బంగా పట్టిసీమలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించనున్నారు.
Maha shivaratri
. రూ. లక్షా 30 వేల నాణేలతో శివలింగం..
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.. అలాంటిది శివుడే కలలో కనిపిస్తే.. అలాంటి అనుభవమే ఓ భక్తుడికి ఎదురైంది. దీంతో అతనో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాణెలతో ఆ మహాశివుడి రూపాన్ని సాక్షాత్కరింపజేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపాడుకు చెందిన చిలక భార్గవ సాయితేజ శివభక్తుడు. రూ. లక్షా 30 వేల నాణేలతో శివలింగం రూపొందించి తన భక్తిని చాటుకున్నారు సాయితేజ. ఇందుకోసం రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలను ఉపయోగించారు. ప్రస్తుతం ఈ శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఓ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో తాను నాణేలతో శివలింగం తయారు చేస్తున్నట్లుగా కల వచ్చిందని సాయితేజ చెప్తున్నారు. దీంతో నాణేలతో శివలింగం తయారు చేయాలని సంకల్పించుకున్నానని.. 60 రోజులు కష్టపడి లింగాన్ని రూపొందించినట్లు వివరించారు. ఈ ప్రయత్నంలో తనకు కుటుంబసభ్యులు, స్నేహితులతో పాటుగా గ్రామస్థులు కూడా పూర్తి సహకారం అందించారని చెప్తున్నారు. గతంలో తాను అయ్యప్ప మాలధారణ చేసి.. శబరిమలకు కాలినడకన వెళ్లినట్లు సాయితేజ తెలిపారు.
పాదయాత్ర చేసుకుంటూ శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నానని.. ఇంటికి చేరిన తర్వాత శబరిమల ఆలయ నమూనాతో గుడిని రూపొందించానని వివరించారు. శివుడి ఆజ్ఞ లేనిదే మానవమాత్రులు ఏమీ చేయలేరంటున్న సాయితేజ.. ఆ శివయ్యే తనతో ఈ శివలింగం తయారు చేయించారని అంటున్నారు. నాణేలతో తయారుచేసిన శివలింగాన్ని మహా శివరాత్రి పండుగ సందర్భంగా.. పట్టిసీమ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రతిష్టించనున్నట్లు సాయితేజ తెలిపారు. నిత్యం ఈ శివలింగానికి పూజలు జరిగేలా ఆలయ అర్చకులు, అధికారులు అంగీకరించినట్లు వివరించారు.
మహా శివరాత్రి పర్వదినం పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. మహా శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేయడం మంచిదని పెద్దలు చెప్తుంటారు. ఆ రోజంతా శివనామస్మరణ చేస్తూ గడపడం, శివుడికి అభిషేకాలు, బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేస్తే శ్రేయస్కరమని పండితులు చెప్తున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్బంగా శైవక్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో భక్తుల రద్దీకి తగినట్లుగా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ ముందస్తు ఏర్పాట్లు చేశారు.