తెలంగాణ ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల.. ఎగ్జామ్ సెంటర్‌ కోసం QR కోడ్

 తెలంగాణ ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల.. ఎగ్జామ్ సెంటర్‌ కోసం QR కోడ్

తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. ఈనెల 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. దాదాపు 10 లక్షల మంది హాజరు కానున్నారు. కాలేజీ ఆన్‌లైన్‌ లాగిన్లలో ఈ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. పరీక్షా కేంద్రం లొకేషన్‌ను గుర్తించేందుకు ఈ క్యూఆర్ కోడ్‌ను అధికారులు ప్రింట్ చేశారు.

Telangana Inter Exams

తెలంగాణ ఇంటర్ హాల్‌ టికెట్లు విడుదల.. ఎగ్జామ్ సెంటర్‌ కోసం

ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి.. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (టీజీబీఐఈ).. విద్యార్థులకు హాల్ టికెట్లను గురువారం రిలీజ్ చేసింది. విద్యార్థులకు తమ తమ కాలేజీల్లోనే హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా కాలేజీల ఆన్‌లైన్ లాగిన్‌ల్లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.

ఇంటర్ విద్యార్థులు కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించి తమ హాల్ టికెట్లను తీసుకోవాలని అధికారులు సూచించారు. తాజాగా విడుదలైన హాల్ టికెట్లలో ఏవైనా తప్పులు ఉంటే.. ఆ విద్యార్థులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆయా ప్రిన్సిపాల్స్ బోర్డు దృష్టికి తీసుకువచ్చి వాటిని వీలైనంత త్వరగా సరిచేసుకోవాలని తెలిపారు.

విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్‌ను సులభంగా వెతుక్కునేందుకు వీలుగా ఈసారి ఇంటర్ హాల్ టికెట్లపై స్పెషల్‌గా క్యూఆర్ కోడ్‌ను కూడా బోర్డు అధికారులు ముద్రించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తమ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో సులువుగా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు మరింత ఈజీగా ఉండటం కోసం.. సెల్‌ఫోన్‌ ద్వారా కూడా హాల్ టికెట్లను పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు వద్ద నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు కూడా నేరుగా ఎస్ఎంఎస్ పంపించనున్నట్లు వెల్లడించారు. అందులో ఉండే లింక్‌ను ఉపయోగించుకుని హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోనున్నట్లు టీజీబీఐఈ స్పష్టం చేసింది.

ఇంటర్ పరీక్షలు ఈనెల 25వ తేదీన ప్రారంభమై మార్చి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈనెల 25వ తేదీన ఇంటర్ ఫస్ట్ ఇయర్.. 26వ తేదీన ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిత్యం 2 షిఫ్టుల్లో నిర్వహించారు. ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండ్ షిఫ్ట్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్‌ జరిగాయి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *