ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరిపై వేటు.. వారిని ఉద్యోగాల నుంచి తొలగింపు!
8 Mepma Employees Suspended In Palnadu District:
పల్నాడు జిల్లా మెప్మాలో జరిగిన అవినీతి వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కలెక్టర్ ఆదేశాలతో 8మంది మెప్మా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. మెప్మాలో ఏకంగా రూ.4 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఏపీలో 56మంది డాక్టర్లకు ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని.. ఈసారి హద్దు దాటితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.
హైలైట్:
పల్నాడు జిల్లా మెప్మాలో 8మంది సస్పెండ్
రూ.4కోట్లు అవినీతి వ్యవహారంలో చర్యలు
56మంది డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ
పల్నాడు జిల్లాలో మెప్మా ఉద్యోగులు సస్పెండ్
పల్నాడు జిల్లాలో 8మంది ఉద్యో్గులపై వేటు పడింది. కలెక్టర్ ఆదేశాలతో 8మంది మెప్మా ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు ఉద్యోగులు రాజకీయ నేతలతో కలిసి నకిలీ గ్రూపుల్ని ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏకంగా రూ.4 కోట్ల మేర రుణాలు తీసుకుని అవినీతి చేసినట్లు తేలింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సీఎం చంద్రబాబుకు ఈ అవినీతి గురించి వివరించారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్కడితో ఆగకుండా వారి నుంచి డబ్బులు రికవరీ కాకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకోవాలన్నారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో కలెక్టర్ మెప్మా ఉద్యోగుల్ని సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. చిలకలూరిపేట కమ్యూనిటీ ఆర్గనైజర్ మల్లికార్జునరావు, నరసరావుపేట కమ్యూనిటీ ఆర్గనైజర్ భూదేవి, గురజాల కమ్యూనిటీ ఆర్గనైజర్ .శ్రీనివాసరావు, పిడుగురాళ్లకు చెందిన కమ్యూనిటీ ఆర్గనైజర్ బాలాంజనేయులు, నరసరావుపేట మెప్మా ఆఫీసులో సిటీ మిషన్ మేనేజర్ తుమ్మా దీప, కమ్యూనిటీ ఆర్గనైజర్ విజయ ప్రణతి, సిటీమిషన్ మేనేజర్ జి.శ్రీనివాసరావు (పిడుగురాళ్ల), సిటీ మిషన్ మేనేజర్ ఉమర్వలి (వినుకొండ)లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మరోవైపు 56మంది డాక్టర్లపై వైద్యారోగ్యశాఖ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా వీరంతా విధులకు హాజరుకావడం లేదు.. ప్రభుత్వుం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. వీరందరిని విధుల నుంచి తొలగించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈలోపు ఈ నెల 21లోగా విజయవాడలోని డీఎంఈ కార్యాలయానికి స్వయంగా వెల్లి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని సూచించారు. ఒకవేళ వెళ్లకపోతే నిబంధనల మేరకు విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. డాక్టర్లు స్వయంగా రాజీనామా చేసినట్లుగా భావిస్తామంటున్నారు. మొత్తం 56మందిలో 9మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 45 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. ఈ 56మంది డాక్టర్లకు చివరి అవకాశంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.